బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) చిత్రం వసూళ్ల వేటలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా నైజాం ఏరియాలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించింది. కేవలం నైజాం ప్రాంతంలోనే ఈ చిత్రాన్ని 30 లక్షల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
తిరుగులేని ఇండస్ట్రీ హిట్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్బస్టర్’గా నిలిచింది. మెగాస్టార్ మార్కు కామెడీ టైమింగ్తో పాటు సెంటిమెంట్ పండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, మూడో వారంలోకి అడుగుపెడుతున్నా ఎక్కడా జోరు తగ్గించడం లేదు.
మూడో వారం కూడా జోరుగానే..
ప్రస్తుతం నైజాం ఏరియాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాల్లోనూ ఈ చిత్రం ‘రాక్ సాలిడ్’గా కొనసాగుతోంది. ఈ వారాంతంలో (3rd Weekend) మరిన్ని రికార్డులు బద్ధలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నయనతార కథానాయికగా నటించగా, వెంకటేష్ అతిథి పాత్రలో మెరవడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.




