2018 నుండి ఉచిత కంటి శిబిరాల ద్వారా వేల మందికి వెలుగు.
సియాటెల్ (అమెరికా): చిరంజీవి గారి సేవా కార్యక్రమాల స్ఫూర్తితో అమెరికాలోని సియాటెల్కు చెందిన ఆయన అభిమానులు మాతృభూమి పట్ల మమకారం మరచిపోలేదు.
ప్రతి సంవత్సరం అక్టోబర్లో జరిగే మైక్రోసాఫ్ట్ గివ్ (Give ) ప్రోగ్రామ్ లో 2018 నుండి ఫండ్రైజింగ్ కార్యక్రమాలు నిర్వహించి, సేకరించిన నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత కంటి శిబిరాల రూపంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ సంస్థలోని గివ్ ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగులు విరాళమిస్తే, అంతే మొత్తాన్ని బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా విరాళంగా ఇస్తుంది.
ఈ విధంగా సమకూరిన నిధులను అమెరికాకు చెందిన మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్ (MSMF), కాకినాడలోని శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి, పద్మశ్రీ డా. చంద్రశేఖర్ సంకురాత్రి గారి ఆధ్వర్యంలో వినియోగిస్తున్నారు.
2018 నుండి ఇప్పటివరకు 34 కంటి శిబిరాలు నిర్వహించి మొత్తం 2,187 కంటి శస్త్రచికిత్సలు, అందులో 2025లో 237 ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు.
ఈ సేవా కార్యక్రమాన్ని శ్రీరామ్ సుంకరి నిర్వహిస్తుండగా , ప్రవీణ్ ఉప్పులూరి, జనార్ధన్ చక్క, మధు బాబు మల్లిడి, సోమా జగదీష్, వినోద్ పర్ణా, మదన్ గుమ్మినేని, రామ్ ఉగ్గిరాల కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవి రియాల్టీ, రెమిట్2ఎనీ సంస్థలు స్పాన్సర్లుగా సహకరిస్తున్నాయి.
దేశం విడిచి ఉన్నా బాధ్యత వదలని ఈ సియాటెల్ చిరంజీవి అభిమానులు , ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో వందలాది మందికి కంటి వెలుగు అందిస్తూ, అభిమానాన్ని సేవగా మార్చి, స్పూర్తికి కొత్త అర్థం ఇస్తున్నారు.